Sunday, August 25, 2013

అమ్మ మహాకుంభమేళా యాత్ర - 3

అమ్మ మహాకుంభమేళా యాత్ర - 3

రాంనరేష్ గిరి బాబా గారి సహాయంతో అమ్మ, అత్తయ్య, సుజాత ఆంటీ నాగాసాకీల గుడారానికి చేరుకున్నారు...

వారికి ఒక టెంటులో కొంత చోటు చూపించి అందులో ఉండమని చెప్పారు... వంటశాల చూపించి అక్కడ వంట కార్యక్రమాలను చూసుకునే "రాందేవ్" బాబాను పరిచయం చేసి వెళ్ళారు రాంనరేష్ గిరి బాబాగారు.

ఒక్కొక్క టెంటు సుమారు 500 మంది ఉండగలిగేంత పెద్దదిగా ఉండేది.వంట గది టెంటు మటుకు చాలా పెద్దగా ఉండేది. వీరందరికీ టీ, కాఫీ భోజనాదులు అన్నీ అక్కడ నుంచే ఏర్పాటు అయ్యేవి.

అంతేకాక అక్కడ బ్యాచీల వారిగా వచ్చి టీ, కాఫీ, సమోసా, లడ్డూ, కేసరి లాంటి పదార్థాలు ప్రతీ ఒక్కరికి ఇచ్చి వెళ్ళేవారు.అలాగే మన గుడారంలో వండేవి పక్క గుడారాలకి వెళ్ళి పంచిపెట్టేవారు.

అక్కడ ప్రతీరోజూ భజన, సత్సంగము జరిగేవి.అందులో అమ్మవాళ్ళు కూడా పాల్గొనేవారు. 

అమ్మ వాళ్ళు స్నానాదులు ముగించుకుని జపము చేసుకుంటూ కూర్చున్నారు...

మొదటి రోజు భజన, సత్సంగము ముగిసింది. భోజన సమయానికి అమ్మావాళ్ళని పిలిచి అందరితో పాటు కూర్చోబెట్టి భోజనం పెట్టారు. అక్కడ అందరూ స్వామీజీలు ప్రసాదం స్వీకరించాకే భోజనం చేసేవారు. భోజనం మటుకు ఉత్తర భారతదేశ పద్దతిలో ఉండేది.పరోటా,ఆలుగడ్డ కూర,ఉడికించిన శెనగలు,పెసలు ఇలాంటివి ఉండేవి.

భోజనం ముగించుకుని టెంటులోకి తిరిగి వచ్చి కాసేపు భగవంతుడిని ధ్యానం చేసుకుని పడుకున్నారు...

ప్రయాగలో అడుగుపెట్టిన మొదటిరోజు అలా గడిచింది.

మరుసటి రోజు పొద్దునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానాలు ముగించుకుని వచ్చారు.

ఇక్కడ ఒక విషయం చెప్పాలి.. అంత మందికి వీలుగా ఉండటానికి ప్రభుత్వం వారు చక్కటి వసతులను కల్పించారు. నిజంగా లెక్కకు మించిన భక్తులకు వసతులు కల్పించడం అంటే మామూలు విషయం కాదు. ఇందుకు ఉత్తర్ ప్రదేశ్ మరియు కేంద్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలపకుండా, వారిని మెచ్చుకోకుండా ఉండలేం...

వీరు స్నానాలు చేసినప్పటికీ స్వామీజీ పిలిచి గంగకు వెళ్ళి స్నానము చేసి రమ్మన్నారు. ఆ అఖాడా (నాగాసాకీల డేరాల)నుంచి 2 కి.మీ.ల దూరం ఉంటుంది గంగ. స్వామీజి చెప్పారని వెళ్ళి స్నానం చేసి వచ్చారు. కానీ పెద్దవారు అవటాన కాస్త అలిసిపోయారు...

తిరిగి వచ్చేటప్పటికి భోజనాల సమయం కావడంతో భోజనానికి రమ్మని పిలిచారు. ఆ రోజు కూడా ఉత్తర భారతదేశ పద్దతిలో భోజనం ఉండేసరికి సరిగ్గా తినలేకపోయారు. ఇది గమనించిన రాందేవ్ బాబా వారిని అందరిముందూ కాక వంటశాలకు పిలిచి విషయం ఏమిటని అడిగారు. 

అమ్మ బాబాగారితో "మేము దక్షిణ భారతదేశం నుంచి వచ్చాము... మాకు ఇలాంటి ఆహారము అలవాటులేక తినలేకపోతున్నాము" అని చెప్పారు.అందుకు బాబాగారు " మీరు అలా ఇబ్బందిపడవద్దు.. మీకు కావాలంటే మీరే వండుకోవచ్చని " చెప్పారు. అందుకు వారు అలాగే చేస్తామని బాబాగారికి కృతజ్ఞతలు చెప్పి తమ గుడారానికి తిరిగి వచ్చారు.

ఆ రోజు స్వామీజీ వద్దకు ఒక విదేశీ వనిత దీక్ష తీసుకోవడానికి వచ్చారు. స్వామీజీ ఆమెకు వారి పద్దతులు వివరించి ఒప్పుకున్న మీదట ఆమెకు ముండనం చేయించి, ఏకవస్త్రను చేసి, "సీతాజ్ఞి"గా పేరు మార్చి దీక్ష ఇచ్చారు. తరువాత భజన,సత్సంగము జరిగింది.

ఆ కార్యక్రమమంతా ముగిసాక అమ్మావాళ్ళు వారి వంట చేసుకోడానికి వంటశాలకు వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే వంటసామాన్లు అన్నీ పెద్దపేద్దవి. టీ,కాఫీలు పెద్దపేద్ద గంగాళాలలో తయారుచేసేవారట. వీరున్నది ముగ్గురు. ఎలా వంట చేసుకోవాలా అని అనుకుంటుంటే సరస్వతి అత్తయ్య ఉపాయంతో మంచినీళ్ళ జగ్గులో ఆలుగడ్డ కూర, రసం,అన్నం వండారు. పెరుగు తెచ్చుకుని పెట్టుకున్నారు.

మనం అనుకుంటాం కానండీ మన పెద్దవాళ్ళ ఆలోచనా తీరు, వారి ఉపాయాల ముందు మనమెంత చెప్పండి...!! ఒక సమస్యకు వారు చిటికెలో సులువైన పరిష్కారం చెప్పగలరు... వారి అనుభవం అలాంటిది... వారు చెప్పేది మంచికే అయినా మనకి అంత దూరాలోచన ఉండక ఏదో చెప్తున్నారులే అని విని వదిలేస్తాం.... పాటించము... ఒక్కోసారి తరువాత మన అనుభవంలోకి వచ్చాక బాధపడతాం... ఒక్కోసారి మనం అనుకున్నదే కరెక్ట్ అవుతుంది అనుకోండి... అంత మాత్రాన వారిది తప్పనీ, వారికి ఏమీ తెలియదని కాదు కదా...(అసలు ఇక్కడ నాకు అనాలేమో... మిమ్మల్ని కలపడం ఎందుకు చెప్పండి... మీరందరూ మంచివారే..)

వంట అంతా ముగించుకున్నారు కానీ.. స్వామీజీ ప్రసాదం స్వీకరించేవరకు తినకూడదు కదా...!స్వామీజీవారు ప్రసాదం స్వీకరించేసరికి సాయంత్రం 4 అయింది.అప్పటివరకు ఆగి అందరితో పాటే భోజనం ముగించారు.

ఇదేంటి భోజనం,వంట వీరికి ఎందుకు అంత తిండిపిచ్చి అనుకోకండి... వయసు పైబడిన వాళ్ళు కదా బి.పి., షుగరు ఉండటాన వేళకు ఆహారం తినకపోతే ప్రమాదము.. ఊరుగాని ఊరు వచ్చి అక్కడ ఏదైనా జరగకూడనిది జరిగితే కష్టం కదా... అందుకన్నమాట వారి తాపత్రయం.


ఇక వచ్చేపోయే భక్తులలతో మళ్ళీ సందడి మొదలయింది. ఆ వచ్చే భక్తులలో ఎవరైనా తెలుగువారు ఉంటే స్వామీజి అమ్మను పిలిచి వారు ఏమి చెప్పదలుచుకున్నారో అడిగి తెలుసుకుని వారికి తగు సలహాలు చెప్పేవారు. అమ్మ భక్తులు చెప్పేది స్వామీజీకి, స్వామీజి చెప్పేది భక్తులకు వివరించేవారు.

ఆ రోజు రాత్రి అనుకోకుండా వర్షం మొదలయింది. వాన... విపరీతమైన చలి. వెంటనే మా సరస్వతి అత్తయ్య వరుణ దేవుడిని "వరుణ దేవా..! ముసలివాళ్ళం, ఊరుగాని ఊరు వచ్చాము, ఎంతోమంది భక్తులు నాయనా...మాకైనా గుడారాలు ఉన్నాయి... గుడారాలు కూడా లేక రోడ్లపైనే పడుకుంటున్న భక్తులు ఎందరో ఉన్నారు... మమ్మల్నందరినీ ఇబ్బందులపాలు చేయకు.. నీ ప్రతాపము తగ్గించుకో..." అని కన్నీళ్ళతో ప్రార్థించారు. 

అంతే మీరు నమ్మరండీ నిమిషంలో వాన తగ్గిపోయింది.

అక్కడ స్వామీజీకి అత్తయ్య ఏమి చేస్తున్నారో అర్థం కాక అమ్మను పిలిచి విషయం ఏమిటని అడిగారు. అమ్మ అంతా వివరించగా విషయం తెలుసుకుని చాలా సంతోషించారు.

ఇక్కడ ఒక మాట చెప్పాలి... కొందరికి వాక్షుద్ధి ఉంటుంది. వారు ఏది అనుకుంటే అది జరిగి తీరుతుంది. అసలు నిజం చెప్పాలంటే ప్రతీ మనిషికీ వాక్షుద్ధి ఉంటుంది. వారు చేసే పనులను బట్టి దాని ప్రభావం ఉంటుంది. వారు మాట్లాడే మంచి/చెడు మాటల వల్ల దాని ప్రభావం తగ్గటం,పెరగడం జరుగుతుంది. మనం మన గురించీ, మన పక్కవారి గురించీ మంచే తలుచుకుని, మంచి జరగాలని కోరుకుంటే మన మాటే వేదం అవుతుంది. మన సంకల్పం బలపడి అనుకున్నది జరిగి తీరుతుంది. దీనికి నాలుక పై మచ్చలు ఉండనక్కర్లేదు... దేవుడే దిగిరానక్కర్లేదు కదా...! దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు మనకు సరిగ్గా ఉపయోగించుకోవటం వస్తే... అంతా శుభమే.. అంతా జయమే..

ఆ వాక్షుద్ధే మా సరస్వతి అత్తయ్యకు ఉంది. అందుకే వారు చేసిన ప్రార్థనకు వరుణ దేవుడు కటాక్షించారు. ఇది నిజంగా జరిగిందా...? మేము నమ్మాలా...? అని ఆలోచించేవారికి/ప్రశ్నించేవారికి చెప్పేది ఏమి లేదండి... చేయగలిగింది కూడా ఏమీ లేదు.. అది వారి ఊహకే వదిలేయడం తప్ప.

1 comment:

  1. మంచి జరగాలని కోరుకుంటే మన మాటే వేదం అవుతుంది. మన సంకల్పం బలపడి అనుకున్నది జరిగి తీరుతుంది. దీనికి నాలుక పై మచ్చలు ఉండనక్కర్లేదు... దేవుడే దిగిరానక్కర్లేదు కదా...! దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు మనకు సరిగ్గా ఉపయోగించుకోవటం వస్తే... అంతా శుభమే...

    Adbhutangaa undi ee post Madhavi garu!!!

    ReplyDelete