Friday, September 30, 2011

Mystery of 1751 and 1752

ఏంటీ ఈ మిస్టరీ అనుకుంటున్నరా...?

అయితే ఇక్కడ క్లిక్ చేయండీ.....


అబ్బో.... మాకెప్పుడో తెలుసులే ....నువ్వు అందరు చెప్పిందే మళ్ళీ చెప్తున్నావనుకుంటే....మీ ఇష్టం...


కానీ ఒక మాటు మళ్ళీ చూస్తే పొయెదేమి లేదు కదా...అనుకుంటున్నరా.... ఇంకెదుకు ఆలస్యం మరి క్లిక్ చేసేయండీ...

Thursday, September 29, 2011

బుడతడి కథలు - బుడతడు చేయని తప్పు

బుడతడికి బామ్మ, తాతయ్య, అమ్మ, నాన్న, అక్క ఉన్నారు.

వాడు పుట్టినప్పటి నుంచే వస పోయకుండానే  ఊ .. ఊ అంటూ తెగ ఊసులు చెప్తూ ఉండేవాడని వాళ్ళ అమ్మ ఎప్పుడూ చెప్పుకొని మురిసిపోతూ ఉంటుంది

కాకపొతే ప్రశ్నలపుట్ట కదా పుట్టినప్పటినుంచే ఎవరైనా చూడటానికి వస్తే బొటనువేలు ఎత్తి (ఏంటీ, ఏందుకు అన్నట్లుగా)ఎదో అడిగే ప్రయత్నం చేసేవాడంట. వచ్చినవారు సమాధానం చెప్పే దాకా వదిలేవాడు కాదంట.

ఇక వాడి దగ్గరికి వస్తున్నారంటే ఏదో ఒక విషయం గుర్తు పెట్టుకొని రావల్సిందే అన్నమాట.

ఇదిలా ఉండగా వాడు కాస్త పెద్దయ్యి నడక నేర్చాడు, అన్నో , ఇన్నో మాటలు కూడా మాట్లడేస్తున్నాడు.

వాళ్ళ  బామ్మ వాడికి శతకాలు నేర్పిద్దామని సుమతీ శతకంతో మొదలుపెట్టింది.

చిన్నవాడు కదా రోజుకి పద్యంలోని ఒకటి, రెండు మాటలు నేర్చుకుంటే చాలు అని రోజుకి ఒక రెండు మాటలు మాత్రమే చెప్పేది.

బాగుందిలే చిన్నవాడు నేర్చుకుంటాడనుకుంటే తప్పే మరి..... ఎందుకో ముందు ముందు మీరే చదువుతారుగా...

ఒక రోజు వాడు వాళ్ళ  నాన్న దాచుకున్న విలువైన వస్తువు పగలగొట్టాడు.
(పాపం కావాలని కాదు లెండి)
ఇక అంతే నాన్నగారు కోప్పడతారేమో అని భయంతో ఉరుక్కుంటూ వచ్చి అటూ ఇటూ దాక్కోవడం మొదలెట్టాడు కాసేపు అమ్మ కొంగు వెనక, కాసేపు నాన్న రాసుకునే బల్ల కింద, ఇంకాసేపు తాతయ్య పడక కుర్చీ వెనక , బామ్మ నులక మంచం కిందా ఇలా...ఎవరడిగినా ఏంటనేది చెప్పడే ఇంతలో నాన్నగారు ఆ వస్తువు పగిలిన విషయం గమనించారు...
బుడతడి అక్కను పిలిచి నువ్వుగానీ చేసావామ్మా అని అడిగారు (పెద్దలైతే చెప్పెస్తారు కదా) అందుకు అక్క "లేదు నాన్నా నేను ఇటువైపుగా రానే లేదు" అని చెప్పింది.

ఇక వీడికి భయం పట్టుకుంది, ఇక నన్నే పిలుస్తారు అని ఎలాగా దేవుడా అని ఇంతలో నాన్న నుంచి పిలుపు రానే వచ్చింది... అందరికీ ఏమీ అర్ధంకాక ఏమైందని విషయం కనుక్కున్నారు.

అమ్మ పిలవడం మొదలెట్టింది, బుడతడికి కొంచం ధైర్యం వచ్చింది.
అమ్మకు చెప్తే ఎలాగో అలా నాకు తిట్లు తప్పిస్తుందిలే అనుకున్నాడు.

మెల్లగా బామ్మ మంచం కిందనుంచి బయటికి వచ్చి అమ్మ దగ్గరికి పరుగు తీసాడు.

తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఏదో ఆస్థాన పండితుల సమావేశం లాగా ఇంటిల్లిపాది అక్కడే ఉన్నారు.

పాపం ఇప్పుడు తప్పించుకోనూలేడు.

అమ్మ దగ్గరకి పిలిచింది. "అరే బుడతాయ్! ఏదైనా తప్పు చేసినప్పుడు వెంటనే నిజాయితీగా ఒప్పేసుకుంటే శిక్ష తప్పుతుంది కదరా మరెందుకు అలా దాక్కుంటున్నవ్" అని అడిగింది.

వాడు ఇక వాడి వాదన మొదలెట్టాదు "నేను అది కావాలని విరగ్గొట్టలేదు కాబట్టి నన్ను ఏమీ అనకూడదు కదా.......
కానీ నాన్నగారికి కోపం వస్తే ఏమీ అలోచించరని బామ్మ మొన్న నీతో అంది కదా...................!
అది గుర్తొచ్చి ఎక్కడ నాన్నగారు నన్ను ముందు తిట్టేస్తారో అని భయపడి పరిగెత్తాను" అన్నాడు.

దానికి ఆశ్చర్యపోవడం వారిద్దరి వొంతయ్యింది.
ఇక బామ్మ అందుకుని "ఆరి భడవా.... నీకెన్ని తెలివితేటలు రా.....మేము అన్న మాట అటుంచి నువ్వు కావాలని చేయకపొయినా నీ చేతిలోనే అది పగిలింది కదా అందుకు తప్పు నీదే కదా మరి అలా పరిగెత్తదం తప్పు కదా" అంది.

అప్పుడు వాడికి ఏదో గుర్తొచ్చినట్టు చిటిక వేసి "అయినా సరే నేను చేసింది తప్పు కాదు అన్నాడు"

దానికి ఇక తాతయ్యకు విసుగొచ్చి "నువ్వు అక్కడే ఉండి నాన్నకు విషయం చెప్తే నాన్న నిన్ను తిట్టరు కదా, కానీ నువ్వలా చేయలేదు కాబట్టీ నువ్వు చేసింది తప్పేరా బుడతా" అన్నారు.

అందుకు బుడత "లేదు తాతయ్యా! లేదు, నేను తప్పు చేయలేదు, అక్కడి నుంచి పరిగెత్తడం తప్పు కాదు" అన్నాడు.

అందుకు నాన్నగారు "పెద్దాచిన్నా ఉండక్కర్లేదు రా! తప్పు చేసి పైగా చేయలేదని తాతయ్యకే ఎదురు చెప్తావా" అని గద్దించేసరికి

బిక్కమొఖం వేసుకొని " మరి బామ్మే కదా 'తప్పించుకున్నవాడు ధన్యుడు సుమతీ' అని రోజంతా చెప్పింది" అందుకని బాగా అలోచించి తప్పించుకున్నాను  నా తప్పేంటి" అని రాగమందుకున్నాడు.

అందుకు వారందరూ ఒక్కసారిగా పగలబడి నవ్వారు.

వాడేమో ఉడుకుమోత్తనం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.

ఇలా వాడు ఎప్పుడూ తప్పు చేయడు, చేసినా ఒప్పుకోడు.
చూసారుగా ప్రతి ప్రశ్న కి ఏదో ఒక సమాధానం ఎలా టకటకా చెప్పేసాడో

అదండీ మన బుడతడు చెయ్యని తప్పు.

మరిన్ని కబుర్లకోసం వేచియుండండి...

Tuesday, September 27, 2011

బుడతడి కథలు

బుడతడి కథలు

అనగనగా ఒక ఊర్లో ఒక బుడతడు ఉండేవాడు.
వాడు వట్టి వాగుడుకాయ మరియు ప్రశ్నలపుట్టానూ....

వాగుడుకాయ అంటే ఏదిపడితే అది మాట్లడేరకం కాదు....
వాడిని వాడు రక్షించించుకోవడానికి ఏదైనా క్షణం లో సృష్టించి చెప్పగల ఘనుడు....

ప్రశ్నలపుట్ట అంటే వాడికి ఏదైనా తెలియకపొతే అది తెలుసుకునే దాకా నిద్రపోడు... అంతవరకే అయితే బాధే లేదు.. కానీ దాని గురించి చెప్పే దాకా ఎదుటివారిని నిద్రపోనివ్వడు...

ఇక వాడి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ చిట్టి పొట్టి కథలన్నీ చదవాల్సిందే మరి...

Sunday, September 18, 2011

అమ్మ చిలిపితనం - 3 ఆరుద్ర పురుగు

అమ్మ చిలిపితనం - 1
అమ్మ చిలిపితనం - 2

అమ్మ స్కూలుకెళ్ళే రోజుల్లో ఎన్ని కోతి వేషాలు వేసేదో చెప్పాలంటే.... నిజంగా నేను ఒక స్నేహితురాలి గురించి చెప్పినట్టు చెప్తేనే... చాలా బాగా చెప్పగలుగుతానేమో.....

అది వర్షాకాలం. రాత్రి బాగా వర్షం పడి పొద్దున్నే ఆగిపోయింది.
అమ్మకి బడి ఎలా ఎగ్గొట్టాలా అనే ఆలోచనే ఎక్కువగా ఉండేది. (ఎవరికైనా చిన్నప్పుడు అదే ఆలోచన ఉంటుంది కదా)

వర్షాకాలం వస్తే బడి ఎక్కువసార్లే ఎగ్గొట్టొచ్చు అని ఆశ. కానీ ఇలా రాత్రి పడి, పొద్దుటికల్లా ఆగిపోయే వర్షం అంటే చచ్చేంత కోపం.బడి ఎగ్గొట్టే వీలుండదు కదా...

అలా ఆ వర్షాన్ని తనివితీరా తిట్టుకుంటూ స్కూలికి వెళ్ళింది అమ్మ. స్కూల్లో ప్రేయర్ అవుతుంది. అందరూ లైనులో నిల్చుని ఉన్నారు. మైకులోంచి శబ్దం వినిపిస్తుంది "స్కూల్ స్టాండెటీజ్.... అట్టేన్షన్ ...స్టాండెటీజ్.... అట్టేన్షన్........స్టాండెటీజ్.... అట్టేన్షన్..... ప్రేయర్ పొజిషన్" అని.

వర్షా కాలంలో ఆరుద్ర పురుగులు చాలా కనబడేవి. మా చిన్నప్పుడు కూడా వర్షం రాగానే ఎక్కడినుంచి వచ్చేవో తెలీదు కాని ఎర్రెర్రగా సిల్కు చర్మంతో....పట్టు పురుగులలాగా........ ముట్టుకుంటే మెత్తగా......చిన్న చిన్నగా పాకుతూ........ అసలు భలే ఉండేవి....... వాటిని జాగ్రత్తగా చేతిలోకి తీసుకుని.... చేతి మీద కాసేపు పాకుతుంటే మురిపెంగా చూసుకుంటూ......... జాగ్రత్తగా అగ్గి పెట్టెల్లో దాచిపెట్టుకునే వాళ్ళం. ఒకటి రెండు రోజులు బాగానే చూసుకునే వాళ్ళం.......... తర్వాత మరి ఆ పురుగులు ఎలా పోయేవో తెలియదు...... చిన్నపిల్లలం కదా..... వాటి గురించి గుర్తు కూడా ఉండేది కాదు....

ఇక అసలు విషయానికి వస్తే ఈ "స్కూల్ స్టాండెటీజ్.... అట్టేన్షన్" హడావిడిలో ఆ ఆరుద్ర పురుగులు తొక్కిళ్ళలో పడి చనిపోయాయంట.
ఇంక మా అమ్మ తన బుద్ధి బలం ఉపయోగించి వాటిని జాగ్రత్తగా ఏరి దాచి పెట్టి...... స్కూల్ ఇంటెర్వెల్ లో ఆ తొక్కిన తన స్నేహితులందరినీ తీసుకొని ఒక మూలకు వెళ్ళి గొయ్యి తవ్వి........ ఈ చనిపోయిన ఆరుద్ర పురుగులను ఆ గోతి లో పాతిపెట్టి...... మట్టి కప్పిందంట.

అంతటితో ఆగక....... తన స్నేహితులతో "ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళ ఆత్మ శాంతించాలంటే కాసేపు గట్టిగా ఏడవాలబ్బా...... (ఇది సొంత తెలివి లేండి......మామూలుగా ఎవరైనా చనిపోతే ఆ కుటుంబ సభ్యులు గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటారు కదా...! అది ఆత్మ శాంతి కొరకు చేసే పని అని అమ్మ ఆలోచన) పాపం ఆ ఆరుద్ర పురుగులు చచ్చిపోయాయి కదా..... వాటి ఆత్మ శాంతించాలంటే మనం కాసేపు గట్టిగా ఏడవాలి" అని చెప్పిందంట.

ఇక చూస్కోండి ఆ స్నేహితులందరూ, అమ్మ కూడా గట్టిగా ఆ ప్రదేశం దద్ధరిల్లేలా ఏడ్చారంట...... అంతటితో ఆగితే సరా........
అమ్మ ఆ స్నేహితులందరినీ తీస్కెళ్ళి ఆ స్కూల్లో ఉన్న జామచెట్ల జామకాయలను కోసి (పిందెలనే లెండి) నాలుగు ముక్కలు చేసి........ ఆ ఆరుద్ర పురుగులకు పిండం పెట్టిందంట.........  అయ్యో రామా.... అదేమి చోద్యం అనుకునేరు.... అక్కడితో కూడా ఆగకుండా..... దానికి 3వ రోజు కర్మలు, 5వ రోజు కర్మలు...... పెద్ద కర్మ అన్నీ చేసి....ఆ జామ పిందెలన్నీ అయిపోయేదాకా పిండాలనీ... తద్దినాలనీ.... తనకు తెలిసిన విజ్ఞానమంతా ప్రదర్శించి..... అనకూడదు కానీ..... నానా యాగీ చేసిందంట.........

నిజంగా దేవుడేగనక ఇదంతా చూసి ఉంటే అమ్మ దెబ్బకు ఆ ఆరుద్ర పురుగులకి ఖచ్చితంగా "చిరంజీవులు కమ్మని" వరమిచ్చేవాడేమో..................

ఇదండీ.... అమ్మ ఆరుద్ర పురుగులకి ఏర్పాటు చేసిన సంతాప సభ.......

ఇంకా మరెన్నో తప్పులు, ఒప్పులు, మిడి మిడి జ్ఞానంతో చేసిన పనులన్నిటినీ రాబొయే పోస్టుల్లో తెలుసుకుందాం.......

Friday, September 16, 2011

అమ్మ చిలిపితనం - 2

అమ్మ చిలిపితనం - 1


అమ్మ చిన్నప్పుడు చాలా అల్లరి చేసేది.... ఆ అల్లర్లన్నీ చెప్పాలంటే ఇలా ఒక్కో పోస్టూ రాయాల్సిందే....
మరి అంతా... ఇంతా... అల్లరి కాదంట... అమ్మమ్మ చెప్తుంది....

ఇంక అసలు విషయానికి వస్తే....
అమ్మ స్కూల్లో కూడా బాగా అల్లరి చేసి టీచర్లతో దెబ్బలు తినేది.
అప్పట్లో గురువులంటే భయం, భక్తి ఎక్కువే కాబట్టి.. కొన్ని కొన్ని సార్లు టీచర్లు చూడకుండా జాగ్రత్తపడుతూ ఉండేదిట..... దొరికిపొతే దెబ్బలే కదా...

ఒకసారి అమ్మకి, అమ్మ స్నేహితులకి మధ్య ఏదో గొడవ జరిగిందంట....
చిన్నప్పుడు గొడవ పడితే వాళ్ళకి ఏదో ఒక హాని చేయాలి అనిపించడం సహజం కదా.... (కావాలని కాకపొయినా)

అమ్మ ఆ రోజంతా బాగా ఆలోచించసాగింది. ఈ లోగా ఇంటి బెల్లు కొట్టేసారు. ఆలోచించుకుంటూ ఇంటిదారి పట్టింది.
స్కూలు నుంచి ఇంటికి వెళ్ళే దారిలో ఒక దులిదొండకాయల చెట్టు కనబడింది (దులిదొండకాయలు అంటే అవేనండీ వాటి పసరు రాస్తే ఒకటే దురద పుడుతుందే... ఆ గుర్తొచ్చిందా... అదే అదే.. అయ్యో.. గుర్తురాలేదా..... మరి మీరేమంటారో... నాకు తెలియదులెండి...)

వాటిని చూస్తూ అలా కొంత దూరం నడిచింది...

ఇంక మెదడులో ఠంగ్ మని గంట మోగింది..... అనుకున్నదే తడవుగా "అక్కా! అక్కా! స్కూల్లో ఒక బుక్కు మర్చిపోయానే... నువ్వు నడుస్తూ ఉండు , నేనెళ్ళి తెచ్చుకుంటాను..." అని పెద్దమ్మకి చెప్పి వెనక్కి పరిగెత్తింది...

కొంత దూరం పరిగెత్తాక ఆ చెట్టు దగ్గర ఆగి ఎవరూ చూడకుండా కొన్ని కాయలు కోసి పుస్తకాల మధ్యన దాచుకొని స్కూలు వైపు పరుగు తీసింది.

తీరా అక్కడికి వెళ్ళి చూస్తే వాచ్ మెన్ ఉన్నాడు.
అమ్మని చూస్తూనే "ఏంటి అమ్మయిగారు! ఇంటికి వెళ్ళకుండా స్కూలుకి వస్తున్నారు" అని అడిగాడు.

మా అమ్మ అబద్దాలు పూలు అల్లినంత తేలికగా అల్లుతుంది.
"నేను లెక్కల పుస్తకం క్లాస్ లో మర్చిపోయాను అందులో ఇచ్చిన లెక్కలు చెయ్యకపొతే రేపు టీచర్ కొడుతుంది" అని చెప్పింది.

అందుకు వెంటనే వాచ్ మెన్ కరిగిపోయి తాళం తీసి "తొందరగా వచ్చేయండీ..! నేను ఇక్కడే ఉంటా" అన్నాడు....

ఇక అమ్మ ఒక్క పరుగున క్లాసులోకి వెళ్ళి ఆ స్నేహితులు కూర్చునే, రాసుకునే బల్లల మీదా ఆ కాయలను బాగా రుద్ది ఏమీ తెలియని దానిలా బ్యాగులోంచి ఒక పుస్తకం తీసి చేతిలో పట్టుకుని బయటకి నడిచింది.

వాచ్ మెన్ అమ్మని చూసి "దొరికిందా అమ్మయిగారూ పుస్తకం?" అని అడిగితే
"ఆ..! దొరికిందంటూ' ఒక్క ఉదుటన ఇంటికి పరుగు తీసింది.

ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు.... ఒక్క అమ్మకు తప్ప.......

మరుసటి రోజు మామూలుగానే స్కూలుకి వచ్చింది...... ఆ గొడవ పెట్టుకున్న స్నేహితురాళ్ళు కూడా వచ్చారు....

ప్రేయర్ అయ్యాక పిల్లలందరూ క్లాస్సులోకొచ్చారు.
ఫస్టు పీరియడ్ మొదలయ్యింది......... ఒక 5నిమిషాల తరువాత ఆ పిల్లలు ఒకటే గోక్కోవడం మొదలు పెట్టారంట...... ఒకటే దురద పాపం ఏంచేస్తారు వాళ్ళు మాత్రం....టీచర్ చూసి బయటికి వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కు రండి అని అరిచిందంట..... ఏమి చేస్తే ఏం లాభం అవి అలా పొయేవి కాదు కదా.......
ఇక ఆరోజంతా అలా గోక్కుంటూనే ఉన్నారంట పాపం....


అమ్మకి మొదట కాసేపు నవ్వొచ్చినా తర్వాత చాలా బాధపడిందంట.......
తప్పు చేసినప్పుడు మనకి మనమే "అయ్యో! అలా చేయకుండా ఉంటే పోయేది కదా!" అని అనుకుంటాం చూడండి...... అదేనండీ పశ్చాత్తాపం అంటారే....అదే.
పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు కదా...! ఆ దేవుడు మా అమ్మ తెలియనితనంతో చేసిన తప్పులన్నీ మన్నించాలని కోరుకుంటున్నాను....

మరి ఆ స్నేహితుల సంగతీ అంటారా... స్కూల్లో స్నేహితులంటే ఎంతసేపు కొట్టుకుంటారు చెప్పండి? మా అంటే ఒకటి లేదా రెండు రోజులు అంతే కదా...... వీళ్ళు అంతే కాకపోతే ఆ దురదలు తగ్గడానికి ఒక వారం పట్టిందనేది మర్చిపోవాలి మరి......

Thursday, September 15, 2011

అమ్మ చిలిపితనం

మా అమ్మ చిలిపితనం

ఏంటీ...? అమ్మ చిలిపితనం ఏంటి....? పెద్దంతరం, చిన్నంతరం లేదా అనుకోకండి...
అమ్మ తను పెద్దయ్యాకే మనకి తెలుసు కాబట్టి అమ్మ అంటే శాంతం, ప్రేమ, ఆప్యాయత,చిరు కోపం కలగలిసిన దేవత అని మాత్రమే తెలుసుకోగలుగుతాం.

మరి అమ్మ తన చిన్నప్పుడు ఎలా ఉండేదో తెలియాలంటే అమ్మ బాల్యం గురించి తెలుసుకోవలసిందే కదా....
అమ్మకి మనం స్నేహితులమే ఐతే ఇది అంత కష్టపడాల్సిన పని కాదని నా ఆలోచన....మీరేమంటారు...?
(మేమేదో అంటాం, అనుకుంటాం గానీ ముందు ఆ చిలిపితనం గురించి తొందరగా చెప్పూ అంటారా...)

అమ్మ చిన్నప్పుడు బాగానే చదివేది కానీ లెక్కల్లో ఎప్పుడూ కొన్ని తక్కువ మార్కులే వచ్చేవి....
పెద్దమ్మేమో ఇంట్లో లీడర్ టైపు(బాగా చదివేది కూడా)
స్కూల్లో రిపోర్టు ఇవ్వగానే పెద్దమ్మ ఇంట్లో చెప్పేసేది......
ఇంక అమ్మకేమో ఎక్కడలేని భయం తాతయ్య ఎక్కడ కొడతారో అని (చదువు విషయం లో కొంచం స్ట్రిక్ట్ లేండి)
కొట్టడం అంటే అచ్చంగా కొట్టడమే కాకపోయినా ఏదో ఒక రకం పనిష్మెంట్ ఉండేది.

పెద్దమ్మ లీడర్ అని చెప్పుకున్నాం కదా... అందరి రిపోర్టులు వరసగా పెట్టుకొని తాతయ్య గారి ముందు నిల్చొని టక టకా అన్ని సబ్జెక్టుల మార్కులు చదివేదంట... దాన్ని బట్టి ఒక్కొక్కరికి పనిష్మెంట్ ఉండేదంట...

ఎప్పుడూ అమ్మ పెద్దమ్మని బతిమిలాడుకునేదిట  ఈ ఒక్కసారి లెక్కల మార్కులు ఎక్కువ చదవమని ఊహూ.. పెద్దమ్మ ససేమీరా ఒప్పుకునేది కాదు...

ఇదిలా ఉండగా ఒకసారి పరీక్షలలో అమ్మకి బాగ తక్కువ మార్కులు వచ్చాయంట (లెక్కలోనే లెండి)
ఇక చూస్కోండి "ఎలా రా దేవుడా! ముందు నుయ్యి, వెనక గొయ్యి లాగా ఉంది పరిస్థితి. రిపొర్టు చూపదామా నాన్న చేతి దెబ్బలు తినాలి, పోని వద్దంటే అక్క రాక్షసి ఊరుకోదు" అని అనుకుంటూ స్కూలు నుంచి వస్తుంది.

ఇంతలోనే పెద్దమ్మ "ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారా ఎన్ని మార్కులు వచ్చాయి" అని అడిగింది.

అందుకు అమ్మ "ఇచ్చారు కాకపొతే చాలా తక్కువ మార్కులు వచ్చాయి. అక్కా ప్లీజ్.. ఈ ఒక్కసారి నాన్నకి చెప్పకే నీ పనులన్నీ నేనే చేస్తాను" అని వేడుకుంది.
(అప్పట్లో పనులన్నీ భాగాలుగా పంచుకుని చేసేవారంట)

అందుకు పెద్దమ్మ ఊరుకుంటుందా అస్సలు ఒప్పుకోలేదు.

అమ్మ బాగా ఆలోచించింది.స్కూలు నుంచి ఇంటికి వచ్చే దారిలో ఒక పెద్ద పాడుబడ్డ బావి ఉండేదిట (పల్లెటూరు కదండీ...)  అమ్మకి వెంటనే ఒక ఉపాయం తట్టింది అనుకున్నదే తడువుగా ఎవరూ చూడకుండా వెళ్ళి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆ బావిలో పడేసింది..

ఎగురుకుంటూ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి "ప్రోగ్రెస్ రిపోర్ట్ లేదుగా ఇప్పుడెలా చెప్తావో చూద్దాం" అని ఎక్కిరించిందంట..

పెద్దమ్మకి కోపమొచ్చి "ఉండు అప్పతో నీ పేరు చెప్పి, నిన్ను తన్నిస్తాను" అన్నదంట.

అందుకు అమ్మ "నీ దగ్గర సాక్షం లేదుగా..... నాకేం భయం... చెప్పుకో.... చెప్పుకో... చెప్పు తీసి తన్నిచ్చుకో" అన్నదంట.

అందుకు మా పెద్దమ్మకి బాగ ఉక్రోషం వచ్చి తాతగారి దగ్గరకు వెళ్ళి విషయం చెప్పడం, తాతగారు కొట్టడం.... మళ్ళీ టీచరికి 5రూపాయలు ఫైను కట్టి రిపోర్ట్ కొత్తది తయారుచేయించుకోవడం మాములే లెండి....

ఇలా ఇంకా చాలా ఉన్నాయి ...... ఒక్కొక్కటిగా పోస్టు చేస్తాను.....

నచ్చనివారు దయచేసి కామెంట్ రాయొద్దని, రాసినా అది పబ్లిష్ చేయబడదని మనవి.

Saturday, September 10, 2011

ఆమె కథ - 6 (ఆఖరి భాగం)


ఇక చదవండి....
                                                           
                                                           ఎప్పటిలాగే మనవాడు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నాడు. కాలచక్రం గిర్రున తిరిగి రెండో సంవత్సరం రానే వచ్చింది. మళ్ళీ 30,000 ఎలాగా అని ఆలోచిస్తుంటే దేవుడు వరమిచ్చినట్లు ప్రభుత్వం వారు స్కాలర్ షిప్ ప్రకటించటం , కాలేజ్ వారు ప్రథమ, ద్వీతీయ ర్యాంకులు  వచ్చిన వారికి నగదు బహుమతులు ఇవ్వడంతో కష్టాలు తీరినాయి. ఎలాగైతేనేమి ఆ పిల్లాడు కష్టపడి 4సం||లు చదివి ఇంజనీర్ అయ్యాడు. అతడి ప్రతిభను గమనించిన ఒక బహుళ సంస్థల కంపెనీ అతనికి నెలకు 30,000 ఆదాయం వచ్చే ఉద్యోగం ఇచ్చింది. ఇక వారి ఆనందానికి అవధి లేదు. అతడు కూడా వారి సహాయాలను విస్మరించక అతడి ఖర్చుల నిమిత్తం ఉంచుకుని మిగితా జీతం వీరికే పంపసాగాడు.

                                     ఇతడి ప్రతిభాపాటవాలు, కష్టపడి పని చేసే తత్వం గమనించిన కంపెనీవారు ఇతనిని విదేశానికి కూడా పంపారు. అతడు అక్కడ పని చేస్తూనే ఈ పల్లెలో వీరి కోసం పెద్ద స్థలం కొని ఆ పిల్లలందరి బాధ్యత తనే తీసుకున్నాడు.

                                  ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి ఇప్పుడామెకు 80సం||లు. కొంతకాలం క్రితమే తాత కన్నుమూసాడు, తాత పోయిన మూణ్ణెళ్ళకే  ముసలామె కూడా చనిపోయింది. వారిద్దరూ పోతూ పోతూ పిల్లలను ఆమె చేతిలో పెట్టి పోయారు.

                                  క్రమేణా పిల్లలందరూ బాగా ఎదిగి ఎవరికి తగ్గట్టు వాళ్ళు స్థిరపడ్డారు. అమెరికా నుంచి తిరిగొచ్చిన పెద్దవాడు ఆ పిల్లలందరితో కలిసి "XXX అనాథ శరణాలయం" మరియు "XXX వృద్ధాశ్రమం" కట్టించాడు.

                                    ఇప్పుడామె పనులన్నీ మానేసింది. అన్నిటినీ చూసుకోవడానికి మనుషులున్నారు. ఆమె పని పర్యవేక్షించడం మాత్రమే. పిల్లలందరూ సంవత్సరానికి ఒక్కసారి వచ్చి ఒక వారం వుండి వెళతారు. ఆమె వారి కోసం ఎన్నో పిండి వంటలు చేయించి వారు వచ్చినప్పుడు స్వయంగా తానే వడ్డించేది. వారు ఒకరొకరే పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు.

         జీవితానికి ఇంతకంటే ఏమి కావాలి చెప్పండి. బ్రతికితే ఇలా బ్రతకాలి. ఏమంటారు? 

                                 ఈ సంస్థలకు ప్రభుత్వం నుండి కూడా కొంత ధనం లభించసాగింది. ఆ 10 మంది పిల్లల దయ వల్ల ఇప్పుడు అది ఎన్నో శాఖలుగా విస్తరిస్తుంది. ఏ  శాఖలోలైనా శరణాలయం, ఆశ్రమం పక్క పక్కనే ఉండటంతో పిల్లలు తాతయ్య, అమ్మమ్మలతో... పెద్దలేమో పిల్లలతో ఆనందంగా గడపసాగారు.

                  వీరి కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆ సంస్థ స్థాపకులను అభినందిస్తూ  "XXXX" అవార్డుతో సత్కరించింది. పెద్దవాడు ఆమెను వెంట తీసుకెళ్ళి ఆ అవార్డు గవర్నరుగారి చేతుల మీదుగా ఆమెకు ఇప్పించాడు.

                              ఆమె కళ్ళనీళ్ళ పర్యంతమయ్యి "ఈ అవార్డుకు అసలు హక్కుదారు నేను కాదు, ఒక 10మంది పిల్లలను చేరదీసిన అమ్మానాన్నలది" అంటూ తాత కథ వివరించింది.

                              ఇదంతా వింటున్నవారందరి కళ్ళు చెమర్చాయి. కొందరి కళ్ళు ఆశ్చర్యంతో మెరిసాయి. కానీ, ఇద్దరి భ్రుకుటులు మాత్రం ముడిపడ్డాయి. వారే కొడుకు, కోడలు. వెంటనే ఆ పల్లెకు వచ్చారు. ఆమె ఉన్నతిని చూస్తూ ఏమనుకున్నారో ఏమో తెలీదండీ "మాతో రా అమ్మా!" అంటే "మాతో రండి అత్తయ్యా!" అని ఒకటే గొడవ. మనవడికి కొడుకు పుట్టాడట. విని సంతోషించింది.

                              "మీరు ఇచ్చిన గది చాలు బాబూ నాకు. ఆ సొమ్ము కూడా నాకు అక్కర్లేదు" అంటూ 20,000 తీసి వారి చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.  ఇదంతా తెలుసుకున్న మనవడు ఆమె వద్దకు వచ్చి "అమ్మమ్మా! నా తండ్రి చేసిన తప్పుకు నేను క్షమాపణలు చెప్పుకుంటాను. నా భాద్యతగా మా ఊరిలోని మీ సంస్థయొక్క బాగోగులు నేను చూసుకుంటాను" అని అన్నాడు.

పోనిలే మనవడైనా మంచివాడిగా మిగిలాడు అని సంతోషించి అలాగే కానిమ్మంది.

ఇదంతా గమనించిన ఆమె కొడుకూ, కోడలు "మమ్మల్ని క్షమించండీ" అంటూ పాదాలు పట్టుకున్నారు.

పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు కదా, అందులోనూ అమ్మ మనసు, వారిని క్షమించింది. ఆ రోజు నుంచి వారు కూడా అక్కడే ఆశ్రమంలో ఉంటూ అక్కడి పనులు చూసుకుంటున్నారు.

కాలం మనెవ్వరి నేస్తం కాదు కదండీ మన కోసం ఆగకుండానే పరిగెత్తుతూ, నీకంటే నే ముందంటూ తనతో పాటు ఆమెను కూడా తీసుకెళ్ళింది.

"ఆమె" ఇప్పుడు లేదు, కానీ ఆమె ఆశలు, ఆశయాలు అన్నీ ఇప్పటికీ ఎప్పటికీ అలాగే ఉంటాయి.

మరి మనం ఏ మాత్రం పక్కవారికి సహాయం చేస్తున్నాం. ఒక్కసారి పరీక్షగా చూడండి ఎందరో మన సహాయం కోసం వేచియున్నారు.
కదలండి.... కాపాడండి.... "మనుషులం" అని చాటి చెప్పండి.  


ఆమె కథ పూర్తిగా చదవడానికి ఈ కింద లింక్ ను క్లిక్ చేయండి
ఆమె కథ


   

Friday, September 9, 2011

ఆమె కథ - 5

ఆమె కథ -1                                                   
ఆమె కథ - 2
ఆమె కథ -3
ఆమె కథ - 4     
ఇక చదవండి....
                                                      ఆమె మాట్లాడడం మొదలు పెట్టింది "ఏమీ లేదు నాన్నా, ఇన్ని రోజులూ నేనూ, నా తల్లి, నా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, భర్త, కొడుకు, కూతురు ఏ ఒక్కరూ నన్ను చూడలేదని ఎంతో బాధపడేదాన్ని. ఒకరు నన్ను చూసేదేంటి? నన్ను నేనే చూసుకుంటాను అనుకొని పనులు చేసుకున్నాను. కానీ "నా కోసం నేను బ్రతికితే అది స్వార్ధం అవుతుంది, పరుల కోసం నేను బ్రతికితే అది పరమార్ధం అవుతుంది" అని గ్రహించలేకపోయాను". అని తన కథంతా తాతకు చెప్పి ఇలా అడిగింది.

                                  "ఇప్పుడు చెప్పు నాన్నా! నేను మీకు ఎలా సహాయపడగలను. నన్నూ మీలో చేర్చుకుంటారు కదా?"

                                "తప్పకుండా తల్లీ! నీ వంతు సహాయం నువ్వు కూడా చెయ్యి, ఎవరి పుణ్యం వారిది, నాతోరా మా ఇల్లు చూపిస్తా" అంటూ ఆమెను తనతో తీసుకెళ్ళాడు.

                                                         తాతది పూరి గుడిసె అందులో ఒక పక్క పొయ్యి మరో పక్క నులక మంచం ఉన్నాయి. ఇంటి వెనక భాగాన ఉంది ఆ పిల్లల గది. పిల్లలు పండగ రోజు కదా ఆడుకుంటున్నారు. ఆ ఇల్లు, ఆ సందడీ చూసి ఆమె ఎంతో ఆనందించింది. తను కూడా ఎలాగైనా వీరికి సహాయపడాలని ఒక గట్టి నిర్ణయానికి వచ్చి అక్కడి నుంచి మెల్లగా ఇంటిదారి పట్టింది.

                                                     ఆ రాత్రంతా బాగా ఆలోచించి తను ఉంటున్న గది అమ్మేసి ఆ పిల్లలతో పాటే ఉందామని నిశ్చయించుకుని నిశ్చింతగా నిద్రపోయింది. ప్రొద్దున్నే లేచి గబగబా పనులు చేసుకుని ఇంటామెతో "అమ్మా! ఇంకా ఏమైనా ఇళ్ళుంటే చెప్పమ్మా చేస్తాను" అని వెళ్ళిపోయింది.

                                               గుడిసె వద్దకు వచ్చిన ఆమెను వారందరికీ పరిచయం చేసాడు. ఆమె తీసుకున్న నిర్ణయం వారందరికీ నచ్చింది. ఆమెను కూడా వారిలో ఒకరిగా స్వీకరించారు. ఆమె కుడా ఎక్కువ గంటలు పనిచేయనారంభించింది. ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బు పోస్టాఫీసు లో వేసింది, పిల్లల కోసమై.

కాలం గడుస్తున్నా కొద్దీ పిల్లలు పెద్ద వారు కాసాగారు. వారో వీరో సహాయాలు కూడా చేస్తున్నారు. ఆ పిల్లల్లో పెద్దవాడు బాగా చదివి వాళ్ళ ఊళ్ళోని బడిలో ఫస్టు వచ్చాడు.

                               అబ్బా! అనుకోకండీ లక్ష్మి లేనిచోట సరస్వతి తప్పకుండా ఉంటుంది.

                                                     వాడిని అదే ఊరిలోని కళాశాల వారు ఉచితంగా చేర్చుకున్నారు. పుస్తకాలు కూడా వారే ఇచ్చారు. మొత్తానికి పెద్దవాడి చదువు గాడిలో పడింది. ఇక దిగులేముంది అనుకుంటూ వారు అలా 2సం||లు గడిపారు. వాడు పై చదువుకు వచ్చాడు. మంచి ర్యాంక్ వచ్చినా 30,000 లేనిదే కాలేజీలో చేర్చుకోమన్నారు మేనేజ్జ్మెంట్ వారు. ఎంత వెతికినా అంత డబ్బు ఎక్కడ నుంచి తేవాలో అర్ధం కాలేదు వారికి.          

                                                                ఎవరైనా 100, 200 అంటే సహాయం చేస్తారు వేలకు వేలు చెయ్యరు కదా! ఇంతలో ఆమెకో ఆలోచన వచ్చింది. తను పోస్టాఫీసులో వేసిన డబ్బు ఇప్పటికి 40,000 అయింది కదా అవి తీద్దాం అంది. అవి తీస్తే మిగితా పిల్లల గతేం కానూ అన్నారు మిగితావారు. ఏదైతే అదవుతుంది లెమ్మని 30,000 ఫీజు కట్టి . 5,000 హాస్టల్ కి కట్టి ఆ సంవత్సరం చదువు వెళ్ళదీసారు.

ఆఖరి భాగం కోసం వేచి చూడండి...

Thursday, September 8, 2011

ఆమె కథ - 4

ఆమె కథ -3

"నేను సంపాదించేది నా కోసం కాదమ్మా!"
ఒహో ఇతనిది కూడా నా లాంటి బతుకే కాకపోతే కొడుకేమైనా డబ్బుకి వేధిస్తాడేమో అనుకుంది.
"నీ కొడుకుల కోసమా నాన్నా ఈ కష్టం?" అని అడిగింది.
"కాదమ్మా అదో పెద్ద కథ. అయినా అదంతా నీకెందుకులే"  అన్నాడు తాత.
"అదేంటి నాన్న అలా అంటావ్ నేను నీ కష్టం తీర్చగలనో లేదో కాని చెప్తే వింటాను కదా, నీ గుండె బరువైనా తగ్గుతుంది" అని అర్ధించింది.
"సరేలే విను. నేను మొదట పండ్లు మాత్రమే అమ్మేవాడిని. రోజంతా అమ్మగా వచ్చిన డబ్బు వీధి చివరన కూర్చుని లెక్కపెట్టుకునే వాడిని. ఇదిలా ఉండగా ఒక రోజు వీధి చివరికి వచ్చేసరికి ఒక పసికందు ఏడుస్తూ కనబడ్డాడు.. దగ్గర్లో ఎవ్వరూ లేరు. ఒక గంట అక్కడే వేచి వున్నా, ఎవరైనా వస్తారేమో అని. కానీ ఎవరూ రాలేదు. చూస్తూ చూస్తూ పసికందును వదలబుద్ది కాలేదు. ఇంటికి తీసుకెళ్దామా అంటే ముసల్ది ఏమంటుందో అని భయం. ఎలాగైతేనేమి ఇంటికి తీసుకెళ్ళాను. ఏమనుకుందో ఏమో ముసల్ది "కన్నబిడ్డలు కాదన్నారు, వీడినైనా మన బిడ్డలా చూసుకుందామయ్యా" అంది. హమ్మయ్యా అనుకొని సంతోషించాను.
       
                          కానీ ఆ రాత్రి నిద్ర పట్టలేదు. వీడంటే నాకు దొరికాడు కాబట్టి పెంచుతాను, ఎందరో పిల్లలు రోడ్డు మీదనే బతికేస్తున్నారు , వాళ్ళందరి సంగతేంటి? వళ్ళ కోసం నా వంతు సహాయంగా నేను ఏమైనా చెయ్యాలి అనుకున్నను. వెంటనే ఈ విషయం పిల్లాడిని పడుకోబెడుతున్న ముసల్దానికి చెప్పాను, అది కూడా సరేనంది. పొద్దున్నే లేచి నా బాల్య స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాను. కొందరు నవ్వారు. కొందరు వెక్కిరించారు. ఇద్దరు మాత్రం నాతో ఏకీభవించారు. మేము నలుగురం కలిసి మా ఇంటి వెనక ఉన్న స్థలాన్ని శుభ్రం చేసి తాటాకులతో ఒక పెద్ద గది కట్టాం. నేను, నా స్నేహితులు వీధులన్నీ వెథికి అనాధ బాలలను తీసుకువచ్చాం. మొత్తం 10 మంది అయ్యారు. ఆ రోజు నుంచి నేను మధ్యాహ్నం కల్లా పండ్లన్నీ అమ్మి, మధ్యాహ్నం నుంచి ఒక వ్యాపారి వద్ద కట్టెల పని చేస్తాను. సాయంత్రం ఇంటికి వచ్చి పిల్లలతో కాసేపు ఆడుకొని అన్నం తిని పడుకుంటాను. రాత్రి పదింటికి లేచి ఫ్యాక్టరీ లో వాచ్ మెన్ గా పని చేస్తుంటాను. ఇలా ఆదివారాలు, పండగ రోజుల్లో గుడి దగ్గర ఉంటాను. మా ముసల్ది పొద్దుట్నించి సాయంత్రం దాకా దగ్గర్లోని బడిలో ఆయాగా పని చేస్తుంది, పిల్లలకి భోజనం వండి పెడుతుంది.
                                             నా స్నేహితులలో ఒకడు పిల్లలకు పాఠాలు చెప్తాడు, మరొకడు వారి కోసం అన్ని చోట్లా తిరిగి పుస్తకాలు, బట్టలు సేకరించి తెస్తాడు." అని తన కథంతా చెప్పాడు తాత.

                                           ఇదంతా విన్న ఆమెకు గుండె ఒక్కసారి ఆగి కొట్టుకోనారంభించిది. కన్నీళ్ళు తుడుచుకోవడం కూడా మరిచి తాతను అలాగే తదేకంగా చూడసాగింది. "ఏంటమ్మా ! అలా చూస్తున్నావు" అన్న తాత మాటలతో ఈ లోకం లోకి వచ్చింది.

Thursday, September 1, 2011

ఆమె కథ -3


                             ఆమె కథ -2


                                                    కొడుకు పట్నం వెళ్ళిపోయాక కనీసం క్షేమంగా చేరానన్న వార్త కూడా చెవిన పడలేదు. ఒక్క ఉత్తరం ముక్కైనా అందలేదు. ఇంక ఆమె తిండీ తిప్పల గురించి కష్టపడవలసిన రోజులు మళ్ళీ వచ్చాయి. "ఈ జీవుడు ఉన్నంత కాలం మనం దేవుడిని నమ్ముకుని ఏదో ఒక కష్టం చేసుకొవలసిందే కదా !" అనుకుని ఆ ఇంటా ఈ ఇంటా పనులు చేసుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతుంది. ఒంట్లో బాగున్నా లేకపోయినా ఒక్క రోజు కూడా మానెయ్యకూడదు కదా పనిమనిషి, ఒకవేళ మనేసినా జీతంలో కోత. ఇలా ఏదోవిధంగా నాలుగు గింజలు నొట్లో పడేంత సంపాదించుకోగలుగుతుంది.

                                              ఇది ఇలా ఉండగా ఒకరోజు ఆమె పని చేయాల్సిన ఇంటికి వెళ్తుండగా దారిలో ఇంటామె కనబడి "నీ కొసమే వస్తున్నా ఇక్కడికి దగ్గర్లో మా పిన్నిగారిల్లు  ఉంది. వారికి పనిమనిషి కావాలట, నువ్వు ఉన్నవు అని చెప్పా తీసుకుని రమ్మన్నారు, ఒకసారి వెళ్ళొద్దాం పదా !" అని అంది. ఆమెకు ఇష్టమా లేదా అనేది ఇంటామెకు అనవసరం కదా!        

                                          ఆమెతో వెళ్తుంది భువనమ్మ. అది వేరే వీధి. "మళ్ళీ రోజు 2 వీధులు దాటుకొని ఇక్కడ దాకా రావాలా" అనుకుంది. ఈ వీధిలోని వారు కాస్త మంచివారుగా తోస్తున్నారు ఆమెకి. అన్నీ పరికించుకుంటూ ఆ ఇంటిలోకి వెళ్ళింది. అక్కడికంటే కాస్త తక్కువ జీతమే అయినా ఎందుకో పని చెయ్యాలనిపించింది ఆమెకు. పని ఒప్పుకుని మరుసటి రోజు నుంచి వస్తానని చెప్పి వెనక్కి వచ్చేసింది.

                                                 కొత్త ఇంట్లో పనికి రెండు రోజులు ఇబ్బంది పడ్డా మెల్లగా సర్దుకుంది. అలవాటయిన పనే కాబట్టి పెద్ద ఇబ్బందులు ఎదురుకాలేదు. అలా రోజూ మొదట ఆ వీధిలో పని చెయ్యటం తిరిగి ఈ వీధికి వచ్చి పని చెయ్యటం, అలా కొనసాగుతుండగా ఒకరోజు ఈ వీధిలో ఇంటివారు ఊరు వెళ్తున్నామనీ మరల రేపు పనికి రమ్మనీ చెప్పారు. సరేలే అనుకుని నడుస్తూ వస్తుండగా  ఒకరింట ఒక తాత కట్టెలు కొడుతూ కనిపించాడు. అందులో ఆశ్చర్యమేమున్నదీ అంటారా! ఆ తాత పక్క వీధిలో పండ్లు అమ్మే తాత. తాతకు 90సం||లు ఉంటాయి. రోజూ గడప నిండా పండ్లు తెచ్చి వీధులన్నీ తిరిగి అమ్మేవాడు. మరి ఆయన కట్టెలు కొట్టడం ఏంటా అనుకుంది. "అయినా నా పిచ్చి కాకపొతే పండ్లు అమ్మడానికి వస్తే కట్టెలు కొట్టమన్నారేమో  నాలుగు డబ్బులు వస్తాయి కదా అని కట్టెలు కొడుతున్నాడేమో" అని అనుకుంది.

                                                    ఇలా కొనసాగుతుండగా రోజూవారి దినచర్యలో ఎక్కడో ఒకచోట తాత తారసపడేవాడు. కానీ వేరువేరు పనులు చేస్తూ "ఏమోలే ఈ తాతకి ఆశ ఎక్కువ ఉన్నట్లుంది" అని నవ్వుకుంది.

                                                     కాలం గడుస్తుంది. ఆ రోజు "కార్తీక పౌర్ణమి" పెందలాడే ఇళ్ళకెళ్ళి పనులు ముగించుకొని, గుడికెళ్ళింది. అప్పటికే పది గంటలయింది. హడావిడిగా గుళ్ళోకి వెళ్ళి 365 వత్తులు వెలిగించి, తీర్థ ప్రసాదాలు తీసుకుని, కాసేపు కూర్చుని, మెల్లగా ఇంటికి వెళ్దామని బయటకు వచ్చింది. తీరా తను చెప్పులు పెట్టే దగ్గర చూస్తే "తాత". ఇందాక హడావిడిలో గమనించలేదు. ఎందుకో తాత గురించి తెలుసుకోవాలనిపించింది ఆమెకు. తాత పక్కనే కూర్చుని "నాన్నా! నువ్వు ఎందుకు ఈ వయస్సులో ఇంత కష్టపడుతున్నావు. అంత డబ్బు ఏమి చేసుకుంటావు. తిండి మందం సంపాదించుకోరాదా?  " అని అడిగింది. అందుకు తాత నవ్వి ఊరుకున్నాడు. కానీ ఆమె పట్టుబట్టి తాతను పదే పదే అడగడంతో తాత నోరు విప్పాడు.