Sunday, September 18, 2011

అమ్మ చిలిపితనం - 3 ఆరుద్ర పురుగు

అమ్మ చిలిపితనం - 1
అమ్మ చిలిపితనం - 2

అమ్మ స్కూలుకెళ్ళే రోజుల్లో ఎన్ని కోతి వేషాలు వేసేదో చెప్పాలంటే.... నిజంగా నేను ఒక స్నేహితురాలి గురించి చెప్పినట్టు చెప్తేనే... చాలా బాగా చెప్పగలుగుతానేమో.....

అది వర్షాకాలం. రాత్రి బాగా వర్షం పడి పొద్దున్నే ఆగిపోయింది.
అమ్మకి బడి ఎలా ఎగ్గొట్టాలా అనే ఆలోచనే ఎక్కువగా ఉండేది. (ఎవరికైనా చిన్నప్పుడు అదే ఆలోచన ఉంటుంది కదా)

వర్షాకాలం వస్తే బడి ఎక్కువసార్లే ఎగ్గొట్టొచ్చు అని ఆశ. కానీ ఇలా రాత్రి పడి, పొద్దుటికల్లా ఆగిపోయే వర్షం అంటే చచ్చేంత కోపం.బడి ఎగ్గొట్టే వీలుండదు కదా...

అలా ఆ వర్షాన్ని తనివితీరా తిట్టుకుంటూ స్కూలికి వెళ్ళింది అమ్మ. స్కూల్లో ప్రేయర్ అవుతుంది. అందరూ లైనులో నిల్చుని ఉన్నారు. మైకులోంచి శబ్దం వినిపిస్తుంది "స్కూల్ స్టాండెటీజ్.... అట్టేన్షన్ ...స్టాండెటీజ్.... అట్టేన్షన్........స్టాండెటీజ్.... అట్టేన్షన్..... ప్రేయర్ పొజిషన్" అని.

వర్షా కాలంలో ఆరుద్ర పురుగులు చాలా కనబడేవి. మా చిన్నప్పుడు కూడా వర్షం రాగానే ఎక్కడినుంచి వచ్చేవో తెలీదు కాని ఎర్రెర్రగా సిల్కు చర్మంతో....పట్టు పురుగులలాగా........ ముట్టుకుంటే మెత్తగా......చిన్న చిన్నగా పాకుతూ........ అసలు భలే ఉండేవి....... వాటిని జాగ్రత్తగా చేతిలోకి తీసుకుని.... చేతి మీద కాసేపు పాకుతుంటే మురిపెంగా చూసుకుంటూ......... జాగ్రత్తగా అగ్గి పెట్టెల్లో దాచిపెట్టుకునే వాళ్ళం. ఒకటి రెండు రోజులు బాగానే చూసుకునే వాళ్ళం.......... తర్వాత మరి ఆ పురుగులు ఎలా పోయేవో తెలియదు...... చిన్నపిల్లలం కదా..... వాటి గురించి గుర్తు కూడా ఉండేది కాదు....

ఇక అసలు విషయానికి వస్తే ఈ "స్కూల్ స్టాండెటీజ్.... అట్టేన్షన్" హడావిడిలో ఆ ఆరుద్ర పురుగులు తొక్కిళ్ళలో పడి చనిపోయాయంట.
ఇంక మా అమ్మ తన బుద్ధి బలం ఉపయోగించి వాటిని జాగ్రత్తగా ఏరి దాచి పెట్టి...... స్కూల్ ఇంటెర్వెల్ లో ఆ తొక్కిన తన స్నేహితులందరినీ తీసుకొని ఒక మూలకు వెళ్ళి గొయ్యి తవ్వి........ ఈ చనిపోయిన ఆరుద్ర పురుగులను ఆ గోతి లో పాతిపెట్టి...... మట్టి కప్పిందంట.

అంతటితో ఆగక....... తన స్నేహితులతో "ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళ ఆత్మ శాంతించాలంటే కాసేపు గట్టిగా ఏడవాలబ్బా...... (ఇది సొంత తెలివి లేండి......మామూలుగా ఎవరైనా చనిపోతే ఆ కుటుంబ సభ్యులు గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటారు కదా...! అది ఆత్మ శాంతి కొరకు చేసే పని అని అమ్మ ఆలోచన) పాపం ఆ ఆరుద్ర పురుగులు చచ్చిపోయాయి కదా..... వాటి ఆత్మ శాంతించాలంటే మనం కాసేపు గట్టిగా ఏడవాలి" అని చెప్పిందంట.

ఇక చూస్కోండి ఆ స్నేహితులందరూ, అమ్మ కూడా గట్టిగా ఆ ప్రదేశం దద్ధరిల్లేలా ఏడ్చారంట...... అంతటితో ఆగితే సరా........
అమ్మ ఆ స్నేహితులందరినీ తీస్కెళ్ళి ఆ స్కూల్లో ఉన్న జామచెట్ల జామకాయలను కోసి (పిందెలనే లెండి) నాలుగు ముక్కలు చేసి........ ఆ ఆరుద్ర పురుగులకు పిండం పెట్టిందంట.........  అయ్యో రామా.... అదేమి చోద్యం అనుకునేరు.... అక్కడితో కూడా ఆగకుండా..... దానికి 3వ రోజు కర్మలు, 5వ రోజు కర్మలు...... పెద్ద కర్మ అన్నీ చేసి....ఆ జామ పిందెలన్నీ అయిపోయేదాకా పిండాలనీ... తద్దినాలనీ.... తనకు తెలిసిన విజ్ఞానమంతా ప్రదర్శించి..... అనకూడదు కానీ..... నానా యాగీ చేసిందంట.........

నిజంగా దేవుడేగనక ఇదంతా చూసి ఉంటే అమ్మ దెబ్బకు ఆ ఆరుద్ర పురుగులకి ఖచ్చితంగా "చిరంజీవులు కమ్మని" వరమిచ్చేవాడేమో..................

ఇదండీ.... అమ్మ ఆరుద్ర పురుగులకి ఏర్పాటు చేసిన సంతాప సభ.......

ఇంకా మరెన్నో తప్పులు, ఒప్పులు, మిడి మిడి జ్ఞానంతో చేసిన పనులన్నిటినీ రాబొయే పోస్టుల్లో తెలుసుకుందాం.......

1 comment:

  1. చాలా బాగుంది. ఆరుద్ర పురుగుల గురించి బహుశా ఈ కాలం పిల్లలకు తెలిసి ఉండదు. తెలుసుకునే అవకాశం కూడా లేదు. కనీసం ఇలాంటి కథల ద్వారానైనా వారికి ఆ అనుభూతి కలిగించే ప్రయత్నం చేశారు. కానీ ఇలాంటి హృద్యమైన అనుభవాలు బ్లాగుల్లో పెడితే ఎవరు చూస్తారు.. ఏదైనా తెలుగు మేగజైన్ కి రాస్తే బావుంటుందని నా సూచన.
    .... రమేశ్ బాబు, సెల్... 9493003022

    ReplyDelete